మర్కజ్‌కు వెళ్లిన 593 మందిని గుర్తించాం: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌


కరోనా నివారణకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. కోవిడ్‌-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో  కమిషనర్‌ మాట్లాడుతూ..'మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 593 మందిని గుర్తించాం. గత నాలుగు రోజుల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మార్కెటింగ్‌ శాఖ ద్వారా 330 మొబైల్‌ మార్కెట్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. కరోనా సోకిన వారి కోసం ఏర్పాటు చేసిన ఆరు ఆస్పత్రుల్లో ఫాగింగ్‌, శానిటేషన్‌ చేస్తున్నాం. లాక్‌డౌన్‌ వల్ల షెల్టర్‌ లేని వారికి ఆవాసం కల్పించి ఉచిత భోజనం అందిస్తున్నాం. వలస కూలీలకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ద్వారా రేషన్‌ అందిస్తున్నాం. మే, జూన్‌ వరకు ఎస్‌ఆర్‌డీపీ పనులు పూర్తవుతాయని' కమిషనర్‌ వెల్లడించారు.